కలం, వెబ్ డెస్క్ : పోలవరం జిల్లా దేవీపట్నం (Devipatnam) మండలంలో పెద్దపులి మరోసారి పంజా విసిరింది. మండల పరిధిలోని పాత గంగంపాలెం గ్రామ సమీపంలో రాత్రి సమయంలో దాడి చేసిన పులి, ఒకేసారి 14 లేగదూడలను హతమార్చింది. వారం రోజులు కూడా గడవకముందే దేవీపట్నంలో ఈ తరహా దాడి మళ్లీ జరగడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
ఈ ప్రాంతంలో గత కొంతకాలంగా పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. ఇటీవలే రాజవొమ్మంగి మండలంలో ఏడు మూగజీవులపై దాడి చేసిన పులి, ఆ తర్వాత గంగవరం మండల పరిసర ప్రాంతాల్లో మూడు రోజుల పాటు సంచరించినట్లు అధికారులు అంచనా వేశారు. ఇప్పుడు దేవీపట్నం మండలంలో ఏకంగా 14 లేగదూడలను చంపేయడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దపులిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో వారి చర్యలు ఫలించడం లేదు. గత మూడు నెలలుగా అధికారులు ఎలాంటి సమర్థవంతమైన చర్యలు చేపట్టలేదని, పులిని బంధించే విషయంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

