కలం, వెబ్డెస్క్: రోజువారీ జీవితంలో ఎదుర్కొనే ఒత్తిడి, ఆందోళన నుంచి మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు మనం వారానికి ఒకసారైనా గుడి (Temple) కి వెళ్తుంటాం. ఇక పుట్టినరోజు, పెళ్లిరోజు, పండుగలు వంటి ప్రత్యేక దినాల్లోనూ గుడికి వెళ్లి దేవుడిని దర్శించుకుంటాం. అయితే భక్తులందరూ దేవుడిని దర్శించుకోవడానికి ముందు చేసే పని.. ప్రదక్షిణ (Pradakshina) చేయడం. అసలు గుడికి వెళ్లినప్పుడు ప్రదక్షిణలు ఎందుకు చేస్తారో చాలా మందికి తెలియదు. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా దేవుడి దర్శనానికి ముందు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయడం హిందూ సాంప్రదాయంలో అనాధిగా వస్తున్న ఆచారం అని మనందరికి తెలుసు. అసలు ప్రదక్షిణ ఎందుకు చేస్తారు అనే విషయాన్ని పండితులు వివరించారు. పండితుల అభిప్రాయం ప్రకారం.. గుడికి వెళ్లినప్పుడు ప్రదక్షిణలు చేయడం వెనుక బలమైన ఆధ్యాత్మిక, మానసిక, వైజ్ఞానిక కారణాలు ఉన్నాయి.
ఈ చరాచర సృష్టికి జీవనాధారమైన భూమి, నిరంతరం తన చుట్టూ తాను ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. అది శక్తిని పొందడానికి తిరుగుతోందా, లేక తన శక్తిని కాపాడుకోవడానికి తిరుగుతోందా అనే ప్రశ్నను పక్కన పెడితే… భూమి తన ప్రదక్షిణను ఆపిన మరుక్షణమే విశ్వంలో మహా ప్రళయం సంభవిస్తుంది, సృష్టి వినాశనమవుతుంది. కేవలం తన చుట్టూ తాను తిరగడమే కాకుండా, భూమాత సూర్యుని చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తోంది. ఆ నిరంతర పరిభ్రమణం వల్లే జీవరాశి మనుగడకు మూలమైన సూర్యరశ్మి, దివ్యశక్తి భూమికి లభిస్తున్నాయని చెబుతున్నారు పండితులు.
అదేవిధంగా, మనం గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసినప్పుడు, ఆ గుడి కేంద్రంలో కేంద్రీకృతమై ఉన్న దివ్య శక్తిని మన శరీరం, మనస్సు గ్రహిస్తాయి. అంటే, విశ్వంలో గ్రహాలు ఎలాగైతే ఒక కేంద్ర బిందువు చుట్టూ తిరుగుతూ తమ ఉనికిని కాపాడుకుంటున్నాయో, మనిషి కూడా తన జీవితానికి కేంద్రమైన భగవంతుని చుట్టూ ప్రదక్షిణ చేసి, తనలోని ఆధ్యాత్మిక శక్తిని పునరుజ్జీవింపజేసుకుంటున్నాడని చెబుతున్నారు.
ఆలయంలో ప్రతిష్టించిన దైవం విశ్వశక్తికి, సమస్త సృష్టికి కేంద్ర బిందువు. ఆ భగవంతుడి విగ్రహం చుట్టూ నిర్మించిన ఆలయ ప్రాంగణం అనంత విశ్వానికి సంకేతం. ఈ విశ్వంలో నిరంతరం జరిగే ఖగోళ పరిణామాలే మనం చేసే ప్రదక్షిణలు. మానవ జీవితం అనేది పుట్టుక నుండి మరణం వరకు సాగే ఒక నిరంతర ఆవృతం (చుట్టు). అంటే, ఈ విశ్వంలో మన జీవిత ప్రయాణమే ఒక మహా ప్రదక్షిణ. ఎన్నో జన్మలుగా మనం చేసిన కర్మల ఫలితాన్నే ఈ జన్మలో సుఖదుఃఖాలుగా అనుభవిస్తూ ఉంటాం. ఆలయంలో ప్రదక్షిణ అనే పేరుతో ఆ పరమాత్ముని చుట్టూ తిరగడం ద్వారా, గత జన్మల చక్రంలో మనం చేసిన పాపకర్మల దుష్ఫలితాలన్నీ తొలగిపోయి మనస్సుకు పవిత్రత లభిస్తుందని చెబుతున్నారు.

