కలం, వెబ్ డెస్క్ : ఆర్టీసీ (TGSRTC) కార్మికుడు శంకర్ గౌడ్ బలవన్మరణానికి పాల్పడటం పై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి (Revanth Reddy) తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటన తనను ఎంతో కలచివేసిందని పేర్కొన్నారు. శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని, తగిన రీతిలో ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ఈ కష్ట సమయంలో ధైర్యం, మనోబలం కలగాలని ముఖ్యమంత్రి ప్రార్థించారు.
క్షణికావేశంలో తీసుకున్న ఇటువంటి అనాలోచిత నిర్ణయాలు ఆయా కుటుంబాలను తీరని దు:ఖంలో ముంచుతాయని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు ఏవైనా ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప, ప్రాణాలు తీసుకోవడం పరిష్కారం కాదని ఆయన సూచించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో ఉందని, ఇప్పటికే వారితో చర్చలు జరుపుతోందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కార్మికులెవరూ అధైర్యపడవద్దని, ప్రభుత్వం వారి సంక్షేమానికి కట్టుబడి ఉందని రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పష్టం చేశారు.

