కలం, వెబ్ డెస్క్: కొత్త పింఛన్ల (Pensions) కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. కూటమి ప్రభుత్వం కొలువుదీరి జూన్ 12 నాటికి రెండేళ్లు పూర్తి కాబోతున్న నేపథ్యంలో, ఆ రోజు నుంచే కొత్త పింఛన్లు ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. తొలి విడతలో వితంతువులకు అందించబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం, కొత్తగా 1.53 లక్షల మంది వితంతు పింఛన్లకు అర్హులుగా ఉన్నారు. వీరికి ప్రతి నెలా రూ.4 వేల చొప్పున అందిస్తే.. నెలకు రూ.61 కోట్ల అదనపు భారం పడుతుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది.
రెండో విడతలో దివ్యాంగులకు..
వితంతువులకు పింఛన్ల (Pensions) పంపిణీ ప్రారంభమైన తరువాత, దివ్యాంగులకు సైతం కొత్త పెన్షన్లు అందించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దివ్యాంగుల కోటాలో 6.50 లక్షల మంది పింఛన్ తీసుకుంటున్నారు. ఇటీవల పింఛన్ల ఏరివేతలో వీరిలో లక్ష మంది వరకు అనర్హులని తేలింది. వీరి స్థానంలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న లక్ష మందికి ఇవ్వాలని భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం 28 కేటగిరీల లబ్ధిదారులకు ప్రతి నెలా పింఛన్లు పంపిణీ చేస్తోంది. కొత్త పెన్షన్ల కోసం అన్ని విభాగాల్లో సుమారు 10 లక్షల మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. వీరికి పింఛన్లు అందించాలంటే నెలకు రూ.400 కోట్లు, సంవత్సరానికి రూ.4,800 కోట్లు అదనపు భారం పడనుంది. దీని కోసం నిధుల సమీకరణకు ఇప్పటి నుంచే ఆర్థిక శాఖ ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
Read Also: ఏపీలో హనీ ట్రాప్.. వెలుగులోకి వస్తున్న సంచలన విషయాలు
Follow Us On : WhatsApp

