కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో తొలిసారి ప్రారంభం కాబోతున్న ‘టీజీ-20 క్రికెట్ లీగ్’ వేలం ఆసక్తికరంగా సాగింది. రామోజీ ఫిలింసిటీలో నిర్వహించిన ఈవెంట్లో తొలుత ఐకాన్స్ ఆటగాళ్ల వేలం జరిగింది. స్టార్ ప్లేయర్ తిలక్ వర్మ (Tilak Varma) కోసం మెదక్ ఫాల్కన్స్, పాలమూరు స్ట్రైకర్స్ పోటీ పడ్డాయి. చివరికి రూ.33 లక్షల అత్యధిక ధరకు తిలక్ వర్మను మెదక్ ఫాల్కన్స్ కొనుగోలు చేసింది. స్టార్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ను వరంగల్ వారియర్స్ రూ.14 లక్షలకు దక్కించుకుంది. ఇక డీజీపీ సీవీ.ఆనంద్ కుమారుడు, ఫాస్ట్ బౌలర్ సీవీ.మిలింద్ను ఖమ్మం ఏసెస్ రూ.17 లక్షలకు కొనుగోలు చేసింది. ఇటీవల కాలంలో రాష్ట్ర స్థాయి టోర్నీల్లో చెలరేగి ఆడుతున్న అమన్ రావును వరంగల్ వారియర్స్ రూ.12 లక్షలకు కొనుగోలు చేయడం గమనార్హం. ఆల్ రౌండర్ తనయ్ త్యాగరాజ్ రంగారెడ్డి రైజర్స్కు రూ.11 లక్షలకు అమ్ముడుపోయాడు. మిగతా ఆటగాళ్లను రూ.10 లక్షల లోపే వివిధ జట్లు దక్కించుకున్నాయి.
1,300 మంది ఆటగాళ్ల వేలం..
టీ20 స్ఫూర్తితో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రారంభించబోతున్న ఈ లీగ్ కోసం 1,300 మంది ఆటగాళ్లు వేలంలోకి వచ్చారు. మొత్తం 8 ఫ్రాంఛైజీలు ఉండగా.. ఒక్కో జట్టు కనీసం 20 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసే అవకాశం కల్పించారు. ఇందుకు గాను ఒక్కో ఫ్రాంఛైజీకి రూ.60 లక్షల మేర మనీ పర్స్ కేటాయించారు. లీగ్ జరిగే 21 రోజుల్లో 32 మ్యాచ్లు ఉంటాయి. అన్నింటినీ ఉప్పల్ స్టేడియంలోనే నిర్వహించబోతున్నారు.

