కలం, వెబ్ డెస్క్ : అంతర్జాతీయంగా తన ప్రతిభను చాటిన భారత నారీ శక్తిని ఐక్యరాజ్య సమితి గుర్తించింది. యూఎన్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ గా భారతదేశపు మొట్టమొదటి మహిళా యుద్ధ హెలికాప్టర్ పైలెట్ మేజర్ అభిలాష బరాక్ (Major Abhilasha Barak) ఎంపికయ్యారు. ఈ మేరకు ఆమెకు ఐరాస జనరల్ సెక్రటరి అంటోనియో గుటెరస్ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా ప్రపంచ గుర్తింపు పొందిన అభిలాషను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ అవార్డు మేజర్ అభిలాష విశిష్ట సేవలకు దక్కిన గొప్ప గుర్తింపు అని ప్రధాని కొనియాడారు. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ చర్యల్లో భారతదేశం సుదీర్ఘకాలంగా అందిస్తున్న అద్భుతమైన సహకారానికి ఈ పురస్కారం ఒక నిదర్శనమని మోదీ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.
అసలు ఎవరీ అభిలాష బరాక్..?
హర్యానాలోని రోహ్తక్కు చెందిన అభిలాష బరాక్ (Major Abhilasha Barak) 2016లో ఢిల్లీ సాంకేతిక విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత, సాయుధ దళాలకు అర్హత సాధించిన ఆమె.. 2017లో చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పొందారు. 2022లో భారత సైన్యంలో మొట్టమొదటి మహిళా కంబాట్ ఏవియేటర్గా నిలిచారు. మహారాష్ట్రలోని నాసిక్లో ఉన్న కంబాట్ ఆర్మీ ఏవియేషన్ ట్రైనింగ్ స్కూల్లోని 6657 ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్ యూనిట్లో శిక్షణ పూర్తి చేశారు.
మేజర్ సుమన్ గవానీ, మేజర్ రాధికా సేన్ల తర్వాత ప్రతిష్టాత్మక మిలిటరీ జెండర్ అడ్వకేట్ అవార్డును అందుకున్న మూడవ భారతీయ మహిళా అధికారిగా బరాక్ నిలిచారు. ఆమె ప్రస్తుతం లెబనాన్లోని ఐక్యరాజ్యసమితి మధ్యంతర దళం (UNIFIL) మోహరించిన భారత బెటాలియన్లో ఎంగేజ్మెంట్ టీమ్ కమాండర్, జెండర్ ఫోకల్ పాయింట్గా పనిచేస్తున్నారు.
Read Also: ఇండియా కూటమికి ఆప్ భారీ షాక్
Follow Us On : WhatsApp

