కలం, వెబ్ డెస్క్ : రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ భారీ కార్యాచరణకు సిద్ధమైంది. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా మే 11 నుండి 17 వరకు విద్యా వారోత్సవాలను (TG Vidya Varotsavalu) ఘనంగా నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ ఉత్సవాలకు వేదికగా హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం ముస్తాబవుతోంది. మే 11 సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై (CURE) ప్రాంతంలోని పాఠశాలల్లో చేపట్టనున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు.
ఈ మెగా ఈవెంట్లో ప్రభుత్వ విద్యా రంగంలోని నూతన ఆవిష్కరణలు, విద్యార్థుల ప్రతిభను చాటేలా ప్రత్యేక ప్రదర్శన స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు ఈ స్టాళ్లను సందర్శించి విద్యార్థుల సృజనాత్మకతను పరిశీలిస్తారు. రాష్ట్ర గీతంతో ప్రారంభమయ్యే ఈ వేడుకలో పాఠశాల బ్యాండ్లు, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ బృందాల మార్చ్పాస్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, విద్యా సంస్కరణలపై ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి కీలక దిశానిర్దేశం చేయనున్నారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి అవార్డుల ప్రదానంతో పాటు ఐఐటీ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించిన కేజీబీవీ యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ విద్యార్థులకు ల్యాప్టాప్లను పంపిణీ చేయనున్నారు. విద్యాశాఖ కార్యదర్శి, ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు ప్రభుత్వ విద్యా ప్రణాళికలను వివరించనున్నారు.

