కలం, వెబ్ డెస్క్ : అమెరికాలో మరో తెలుగు విద్యార్థి శనివారం దారుణ హత్యకు (Telugu Student Murder) గురైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ కు చెందిన యువకుడు న్యూయార్క్లో కాల్పుల్లో చనిపోయాడు. ఎంబీఏ కోర్సు కోసం 2023లో అమెరికాలోని న్యూయార్క్ నగరానికి వెళ్ళిన మల్కాజిగిరికి చెందిన అన్షుల్ కుంచా (28)(Anshul Kuncha) వీకెండ్స్ లో పిజా డెలివరీ ఎగ్జిక్యూటివ్ పనులు చేస్తూ ఉంటాడు. ఆ ప్రకారమే శనివారం సైతం ఒక డెలివరీ ఆర్డర్ వస్తే వెళ్ళాడు. కానీ అది నకిలీ ఆర్డర్ అని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. నకిలీ ఆర్డర్ అనే విషయం తెలియని అన్షుల్ పై ఫిలడెల్పియాలోని డెలివరీ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ముఖానికి ముసుగులు ధరించిన వ్యక్తి కాల్పులు జరిపినట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది.
పక్కా ముందస్తు ప్లాన్ ప్రకారం ఫేక్ డెలివరీ ఆర్డర్ ఇచ్చి నిర్మానుష్య ప్రదేశానికి రప్పించుకున్నారని, జన సమ్మర్ధం లేకపోవడంతో కాల్పులు జరిపారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మరణించాడని, అతని నుంచి నగదు లేదా విలువైన వస్తువులను ముట్టుకోలేదని తెలిపారు. ఈ మృతి ఘటనను వెంటనే న్యూయార్క్ లోని ఇండియన్ కాన్సులేట్ కు తెలియజేశామని, మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు సహకరిస్తామన్న భరోసా ఇచ్చారని కుటుంబ సభ్యులు తెలిపారు.

