కలం, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లాకు చెందిన రచయిత బొగ్గుల శ్రీనివాస్(Boggula Srinivas) ఖమ్మంలో జరిగిన ఓ ప్రమాదంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. శనివారం రాత్రి కూసుమంచి వద్ద జరిగిన ఈ ఘటనలో శ్రీనివాస్ కారు పాలేరు రిజర్వాయర్లోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ అక్కడి నుంచి ఎందుకు పరారయ్యాడన్నది చర్చనీయాంశంగా మారింది.
బొగ్గుల శ్రీనివాస్ 2014లో పవన్ కల్యాణ్(Pawan Kalyan) రాజకీయ ప్రవేశాన్ని విమర్శిస్తూ ‘పవన్ కల్యాణ్ హఠావో పాలిటిక్స్ బచావో’ అంటూ ఓ వివాదాస్పద పుస్తకాన్ని రాశారు. అప్పట్లో ఈ పుస్తకం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పవన్ అభిమానులు, జనసేన మద్దతుదారులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలో పలు కేసులు నమోదవగా శ్రీనివాస్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు శ్రీనివాస్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం హాట్ టాపిక్ గా మారింది.


