కలం, వెబ్ డెస్క్: తెలంగాణ విద్యాశాఖ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు హాఫ్ డే స్కూళ్లను (Half Day Schools) అమలు చేయనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డా. ఈ. నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలలోని ప్రాథమిక, ఉన్నత ప్రాథమిక, హైస్కూల్లు మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు హాఫ్ డే మాత్రమే స్కూళ్లు కొనసాగనున్నాయి. పాఠశాలలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగనున్నాయి. అనంతరం ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అందించి విద్యార్థులను ఇంటికి పంపిస్తారు .
ఎస్సెస్సీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయడానికి 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ఎస్సెస్సీ పరీక్షా కేంద్రాలుగా ఉన్న పాఠశాలలు పరీక్షలు జరిగే రోజుల్లో మాత్రమే మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయని, మిగతా రోజుల్లో హాఫ్ డే సమయాలనే పాటించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు అందజేశారు. కచ్చితంగా అమలు చేయాలని జిల్లా విద్యా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

