ఖమ్మంలో రైతు సంఘం ఆందోళన.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం (Khammam) కలెక్టరేట్ వద్ద తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం(Telangana Rythu Sangham) ఆధ్వర్యంలో రైతులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ బుధవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాగం హేమంతరావు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు.

భూ భారతి(Bhu Bharati) వ్యవస్థ ధరణికి నకలుగా మారిందని, సుమారు 9.25 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఆరోపించారు. పట్టాదారు పాసుపుస్తకాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రైతాంగ సమస్యల పరిష్కారంలో తెలంగాణ (Telangana) ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. గత ప్రభుత్వ విధానాల బాటలోనే ప్రస్తుత ప్రభుత్వం కూడా కొనసాగుతోందని ఆరోపించారు. ప్రభుత్వ విధానాల వల్ల మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు.

రైతు భరోసా విషయంలో ప్రభుత్వం హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. ఇప్పటికే ఒక సీజన్ తప్పించారని, మార్చి వచ్చినప్పటికీ నిధులు విడుదల చేయలేదని అన్నారు. 22వ తేదీ నుంచి దశల వారీగా చెల్లిస్తామని చెబుతున్నా, పూర్తిస్థాయి అమలు ఎప్పుడో స్పష్టత ఇవ్వలేదని ప్రశ్నించారు. పెట్టుబడి సాయం వ్యవసాయం పూర్తయ్యాక ఇస్తారా అని నిలదీశారు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, తప్పుడు లెక్కలతో పూర్తయిందని ప్రకటించడం సరికాదని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన పంటల బీమా హామీని ఐదు సీజన్లు గడిచినా అమలు చేయలేదని ఆరోపించారు.

తక్షణమే రైతుల ప్రధాన సమస్యలను పరిష్కరించాలని, లేకపోతే రైతుల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్, సహయ కార్యదర్శి జమ్ముల జితేందర్రెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దొండపాటి రమేష్, కొండపర్తి గోవిందరావు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>