కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా కలెక్టర్ అంకిత్ మాదకద్రవ్యాల (Drugs) అక్రమ రవాణాను అరికట్టేందుకు కఠినంగా వ్యవహరిస్తున్నారు. బుధవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్తో కలిసి మాదకద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశంలో మాట్లాడారు. చెక్పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి శాఖ తమ పరిధిలో చేపట్టిన తనిఖీలు, నమోదైన కేసుల వివరాలతో సమగ్ర నివేదికలను సమర్పించాలని సూచించారు.
వ్యవసాయాధికారులు మారుమూల ప్రాంతాల్లో క్షుణ్ణంగా పరిశీలించి గంజాయి సాగును గుర్తిస్తే వెంటనే పోలీస్ శాఖకు సమాచారం అందించాలని ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా పాఠశాలల్లో ప్రతి బుధవారం మాదకద్రవ్యాలపై అవగాహన తరగతులు నిర్వహించాలన్నారు. పాఠశాలలకు 100 మీటర్ల దూరంలో పాన్ షాపుల్లో సిగరెట్లు, డ్రగ్స్ విక్రయాన్ని అరికట్టేందుకు తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.
జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ.. వైద్య శాఖ పరిధిలో నిర్వహిస్తున్న డి-అడిక్షన్ కేంద్రాల్లో నమోదైన కేసుల వివరాలను తెలియజేయాలన్నారు. కొత్తగూడెం అంతర్రాష్ట్ర సరిహద్దు జిల్లా కావడంతో మాదకద్రవ్యాల రవాణా అధికంగా ఉండే అవకాశం ఉందన్నారు. గత నెలలో సుమారు 6000 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ గుర్తు చేశారు.

