కలం, వెబ్ డెస్క్ : సాగు భూములు, స్థలాలు, స్థిరాస్తి విక్రయాల ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి మే నెలలో రికార్డు స్థాయిలో ఆదాయం (Telangana Revenue) వచ్చింది. మే 2026లో ఏకంగా రూ.1,698.96 కోట్ల రాబడి వచ్చింది. గత ఏడాది రూ. 1,390 కోట్లు రాగా.. ఈ ఏడాది రూ.308.96 కోట్లు పెరిగింది. ఈ మేరకు గత ఏడాది కంటే అధికంగా 24.20% వృద్ధి నమోదైంది. అంతేకాదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మే నెలతో పాటు అన్ని నెలలకూ ఇదే అత్యధిక రాబడిగా రికార్డు నమోదైంది. గత ఏప్రిల్ నెలలోనూ రూ.1,408.35 కోట్ల ఆదాయం వచ్చింది.
తెలంగాణలో భూములు, స్థలాల ప్రభుత్వ విలువను సవరించనున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన వేళ రికార్డు స్థాయి ఆదాయం వచ్చిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక మే నెలలో ధరలు భారీగా ఉన్న ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. మే నెలలో 1.47 లక్షల దస్తావేజుల రిజిస్ట్రేషన్లు జరిగాయని పేర్కొన్నారు. గత ఏడాది ఇదే నెలలో 1.64 లక్షల దస్తావేజుల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు వివరించారు.

