కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ (Orange Alert Telangana) జారీ చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి (CM Revanth) అధికారులను అప్రమత్తం చేశారు. రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రభుత్వ యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి నష్టం జరగకుండా అదనపు ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు.
రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లను మరింత వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. కల్లాల్లో ఉన్న ధాన్యం వర్షానికి తడవకుండా చూసేందుకు అవసరమైన టార్పాలిన్లను తక్షణమే అందుబాటులో ఉంచాలన్నారు. ఇప్పటికే కొనుగోళ్లు పూర్తయిన కేంద్రాల నుంచి అవసరమైన చోటికి టార్పాలిన్లను తరలించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు రాష్ట్రంలో బలమైన ఈదురుగాలులు వీస్తాయన్న వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) విజ్ఞప్తి చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

