కలం, మెదక్ బ్యూరో : తెలంగాణ (Telangana) రాష్ట్రం మత సామరస్యానికి ప్రతీక అని.. పవిత్రమైన రంజాన్ మాసం సోదరభావం, సహనం, పరస్పర గౌరవం పెంచుతాయని రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ(Damodar Raja Narasimha), ఉత్తమ్కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) , కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) అన్నారు. రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరుల కోసం ఆదివారం సంగారెడ్డి (Sangareddy) పట్టణంలోని మిలాద్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో రాష్ట్ర మంత్రులు పాల్గొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ మైనారిటీల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ముస్లిం సోదరుల అభ్యున్నతికి విద్య, ఉపాధి, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు. రంజాన్ పండుగ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించే గొప్ప పండుగ అని, తెలంగాణ (Telangana) రాష్ట్రం అన్ని మతాలు, వర్గాలు కలిసి జీవించే సంస్కృతికి నిలయమని తెలిపారు.
ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్రంలో శాంతి, అభివృద్ధి కొనసాగాలని ఆకాంక్షించారు. రంజాన్ మాసం ప్రేమ, శాంతి, సహకారం పెంపొందించే పవిత్రమైన కాలమని అన్నారు. ఉపవాస దీక్ష ద్వారా మనసును పవిత్రం చేసుకోవడం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం ఈ పండుగ ప్రత్యేకత అని తెలిపారు. ఈ ఇఫ్తార్ కార్యక్రమంలో ఎంపీ సురేష్ షెత్కర్, టీజీఐసీ చైర్పర్సన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

