కలం, వెబ్ డెస్క్: ఇటీవల తెలంగాణలో పవన్ కల్యాణ్ సభకు అనుమతి ఇవ్వకపోవడం, ఏపీలో పరిస్థితులపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి తెలంగాణ జనసేన (Telangana Janasena) పార్టీ కౌంటర్ ఇచ్చింది. తెలంగాణలో కూడా ఏపీ తరహా స్వేచ్ఛ కావాలని, అలాంటి రాజ్యాంగ స్ఫూర్తిని తెలంగాణ సమాజం కోరుకుంటుందని జనసేన పేర్కొంది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ ఆసక్తికర పోస్టు చేసిది. శాంతి భద్రతల దృష్ట్యా పవన్ సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని, పవన్కు తెలంగాణలో తిరిగే స్వేచ్ఛ ఉందని రేవంత్ రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించారు. ఏపీలో జగన్ సభలకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని, శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకునే కదా? అని ప్రశ్నించారు.
సీఎం రేవంత్ వ్యాఖ్యలు అర్ధరహితమని, ఒక రాజకీయ పార్టీ తమ కార్యకలాపాల గురించి, భవిష్యత్తు కార్యాచరణ గురించి క్రియాశీలక కార్యకర్తలతో, రాష్ట్ర నాయకులతో నిర్వహించుకోదలచిన కార్యక్రమానికి అనుమతి ఇవ్వకపోవడం ఏమిటని జనసేన నిలదీసింది. సీఎం రేవంత్ తన చర్యలను సమర్థించుకోవడం పట్ల మండిపడింది. ఏపీలో జగన్ సభలకు కూటమి ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం లేదని నిందలు మోపడం సరికాదని పేర్కొంది. ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనతో మొదలు రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ఎప్పుడైనా, ఎక్కడికైనా పర్యటిస్తున్నారని తెలిపింది. తన నిర్ణయాన్ని సమర్థించుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి పక్క రాష్ట్ర ప్రభుత్వంపై అవగాహనా లోపంతో నిందలు వేయడంపై మరోసారి ఆలోచించుకోవాలని హితవు పలికింది.

