కలం, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా తునిలో వారం రోజుల కిందట చిన్నారి జ్ఞానేశ్వరి తప్పిపోయిన ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పందించారు. జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడిన ఆయన.. గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు. గాలింపు కోసం అదనపు బృందాలను రంగంలోకి దించాలని డిప్యూటీ సీఎం సూచించారు. పోలీస్, SDRF బృందాలతో పాటు NDRF సేవలను కూడా ఉపయోగించుకోవాలన్నారు. పరిసర అటవీ ప్రాంతాల్లో జల్లెడ పట్టేందుకు అటవీ శాఖ నిపుణుల సహాయం తీసుకోవాలని స్పష్టం చేశారు.
డ్రోన్లతో గాలింపు..
400 మంది పోలీస్, అటవీ శాఖల సిబ్బందితో గాలింపు చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు వివరించారు. అత్యాధునిక డ్రోన్లతో అణువణువు జల్లెడ పడుతున్నామని తెలిపారు. అంతేగాకుండా, చిన్నారి వెళ్లిన ప్రదేశాల్లోని 38 సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించామని పేర్కొన్నారు. చిన్నారి వెంట వెళ్లిన కుక్క మూడు రోజుల తరువాత వచ్చిందని.. జీపీఎస్ ట్రాకర్ పెట్టి అడవిలోకి పంపించినా ఆధారాలు లభించలేవన్నారు. ఈ రోజు కుక్క కూడా మరణించిందని.. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ వివరించారు.

