కలం, వెబ్ డెస్క్ : ఇంటర్మీడియట్ (Telangana Inter) ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్స్ తప్పనిసరి చేస్తూ తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ఈ నూతన విధానాన్ని అమలు చేయబోతున్నారు. దీని ప్రకారం ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు ప్రతి వారం ప్రాక్టికల్స్ నిర్వహించడం విధిగా మారుతుంది. మార్కుల కేటాయింపులో కూడా బోర్డు పలు మార్పులు చేసింది.
ఎంపీసీ విభాగం విద్యార్థులకు 30 మార్కులు, బైపీసీ విభాగం విద్యార్థులకు 60 మార్కులను ప్రథమ సంవత్సర ప్రాక్టికల్స్కు కేటాయించారు. వీటితో పాటు గణితం సబ్జెక్టుకు కూడా అంతర్గత (ఇంటర్నల్) మార్కులు ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది. ఈ నూతన విధానానికి సంబంధించిన ప్రాక్టికల్స్ మాన్యువల్ను రాబోయే 15 రోజుల్లో అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని ఇంటర్ బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ స్పష్టం చేశారు.

