కలం, వెబ్ డెస్క్ : ఫీజు రీయింబర్స్మెంట్ (Fee Reimbursement) బకాయిల అంశంలో తెలంగాణ ప్రభుత్వ తీరుపై రాష్ట్ర హైకోర్టు (TG High Court) తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నంబర్ 7 కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని ప్రాథమికంగా అభిప్రాయపడింది. గతంలో రీయింబర్స్మెంట్ నిధులు విడుదల కాకపోతే ఆ బకాయిలను విద్యార్థుల నుంచి వసూలు చేసుకునే వెసులుబాటును న్యాయస్థానం ప్రైవేట్ కాలేజీలకు కల్పించింది. అయితే ప్రభుత్వం కొత్తగా తెచ్చిన జీవో ప్రకారం విద్యార్థుల ఖాతాల్లో నిధులు జమ చేసిన తర్వాతే వసూలు చేసుకోవాలని నిబంధన విధించడాన్ని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు కోర్టులో సవాలు చేశాయి.
ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. అటు రీయింబర్స్మెంట్ (Fee Reimbursement) చేయకుండా ఇటు కాలేజీలను వసూలు చేసుకోనివ్వకుండా ఇబ్బందులకు గురిచేయడం సరికాదని వ్యాఖ్యానించారు. ఈ జీవో హైకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఉందని స్పష్టం చేస్తూ దాని అమలుపై స్టే విధించారు. తదుపరి విచారణను మే 4వ తేదీకి వాయిదా వేస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు.

