కలం, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో గృహ వినియోగదారులకు ఉచితంగా విద్యుత్ ఇచ్చేందుకు అమలు చేస్తున్న గృహజ్యోతి (Gruha Jyothi) పథకానికి నిధులు మంజూరు చేసింది. గృహ వినియోగదారులకు నెలకు 200 యూనిట్ల వరకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం అమలు చేసేందుకు 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.2,080.38 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం పరిపాలనా అనుమతి జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి నవీన్ మిట్టల్ జీవో విడుదల చేశారు. ఉత్తర్వుల ప్రకారం ఈ నిధులను టీజీ డిస్కమ్లకు సబ్సిడీగా అందజేయనున్నారు. గృహ జ్యోతి పథకం అమలుకు సంబంధించిన వ్యయాన్ని భరించేందుకు బడ్జెట్ అంచనాల నుంచి ఈ మొత్తాన్ని కేటాయించారు. టీజీఎస్పీడీసీఎల్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రభుత్వం వద్ద పరిపాలనా అనుమతి కోరగా, ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అలాగే, ఏప్రిల్ 2026 నెలకు గాను రూ.186.96 కోట్లు విడుదల చేసేందుకు ట్రెజరీలకు అనుమతి ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది.
అదే విధంగా, ఈ నిధుల వినియోగంపై TGSPDCL చీఫ్ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) వినియోగ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. మొత్తంగా, గృహ జ్యోతి పథకం కింద రాష్ట్రంలోని లక్షలాది గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కీలకంగా మారింది. ప్రజలపై విద్యుత్ భారం తగ్గించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

