కలం, నిజామాబాద్ బ్యూరో: ప్రపంచ రక్తదాతల దినోత్సవం (World Blood Donor Day) సందర్భంగా తెలంగాణ రెడ్ క్రాస్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో లోక్ భవన్లో ఘనంగా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల (Shiv Pratap Shukla) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, “రక్తదానం చేయండి.. మానవత్వాన్ని చాటండి” అంటూ ప్రజలను రక్తదానానికి ప్రోత్సహించారు. సమాజంలో ప్రాణాలను కాపాడే మహత్తర సేవగా రక్తదానం నిలుస్తుందని అన్నారు.
కార్యక్రమంలో భాగంగా రక్తదాతలు, రక్తదానాన్ని ప్రోత్సహిస్తున్న సంస్థలు, రక్తనిధులకు గవర్నర్ అవార్డులు అందజేశారు. నిజామాబాద్ జిల్లా పోలీస్ శాఖ తరఫున కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయి చైతన్యకు ప్రదానం చేసిన అవార్డును అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ప్రకాష్ స్వీకరించారు. పోలీస్ శాఖ ద్వారా అత్యధిక రక్తదానాలు నిర్వహించినందుకు ఈ గౌరవం లభించింది. అలాగే జిల్లా రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున జనరల్ సెక్రటరీ ప్రశాంత్ (ఎంఆర్వో, వర్ణి) అవార్డును అందుకున్నారు. అత్యధిక సంఖ్యలో రక్తదాతలను ప్రోత్సహించినందుకు ఈ అవార్డు ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బుస్సా ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్, కోశాధికారి కర్పూరి రవీందర్, కార్యవర్గ సభ్యుడు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.అదేవిధంగా లోక్ భవన్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 87 సార్లు రక్తదానం చేసిన రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్ను గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు.

