కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) ఉద్యోగులకు ఊరటనిస్తూ పెండింగ్ లో ఉన్న బిల్లుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ అధికారులు మొత్తం 745 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగ సంఘాలకు గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ప్రభుత్వం ఈ నిధులను మంజూరు చేసింది.
గత జూన్ నెల నుంచి ప్రతి నెలా కనీసం 700 కోట్ల రూపాయలకు తగ్గకుండా ఉద్యోగుల పెండింగ్ బిల్లులను పరిష్కరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే తాజాగా ఈ భారీ మొత్తాన్ని విడుదల చేశారు. ఉద్యోగుల ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల నిర్వహణ, ఇతర అవసరాల కోసం ఆర్థిక శాఖ అధికారులు 389 కోట్ల రూపాయలను విడుదల చేశారు.

