కలం, ఖమ్మం బ్యూరో: రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపిన గర్భిణీ వనజ మృతి (Woman Vanaja Death) ఘటనపై ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించింది. ఘటనపై వైద్యారోగ్య శాఖ సీరియస్ అయ్యింది. ఈ విషాదకర సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించేందుకు గాను ఒక ఉన్నత స్థాయి అధికారుల బృందాన్ని ప్రభుత్వం నియమించింది. ఈ ప్రత్యేక విచారణ కమిటీలో పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర నాయక్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సుధీర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్, డీసీహెచ్ఎస్ డాక్టర్ రవి బాబు సభ్యులుగా ఉన్నారు.
ఈ ఉన్నత స్థాయి బృందం వనజ మృతికి దారితీసిన పరిస్థితులపై అన్ని కోణాల్లోనూ క్షుణ్ణంగా విచారణ జరపనుంది. వైద్యుల నిర్లక్ష్యం ఏమైనా ఉందా, చికిత్స అందించడంలో లోపాలు జరిగాయా అనే అంశాలను ఈ కమిటీ పరిశీలించనుంది. ఘటనపై పూర్తి స్థాయి నివేదికను సిద్ధం చేయడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి దారుణ సంఘటనలు ఎక్కడా పునరావృతం కాకుండా ఉండేందుకు, గర్భిణీలకు మరింత సురక్షితమైన వైద్య సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన అవసరమైన చర్యలను, కీలక సిఫారసులను ఈ కమిటీ ప్రభుత్వానికి సమర్పించనుంది.

