కలం, నిర్మల్: పార్టీలకు అతీతంగా ప్రజా సంక్షేమం, గ్రామాల అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని ఖానాపూర్ ఎమ్మెల్యే (Khanapur MLA) వెడ్మ బొజ్జు పటేల్ (Vedma Bhojju Patel) అన్నారు. గురువారం కడెం మండలం లింగాపూర్ గ్రామంలో ఎస్ఐఆర్ ఫేజ్–2లో భాగంగా నిర్వహించిన గ్రామ సభలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు ఉంటాయని, ఎన్నికలు ముగిసిన అనంతరం ప్రజా సమస్యల పరిష్కారమే తన ధ్యేయమని స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధులు కేటాయిస్తూ, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు.
ఎస్ఐఆర్ ప్రక్రియలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. ఓటరు జాబితాలో పేర్లు, వివరాలలో ఏవైనా తప్పులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లి సరిచేసుకోవాలని గ్రామస్తులకు సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోరారు.

