కలం, వెబ్ డెస్క్: తెలంగాణవ్యాప్తంగా రేపు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. జూన్ 2న ఉదయం 8 నుంచి 10 గంటల వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో 13వ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు (Telangana Formation Day) జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని రాష్ట్ర ప్రగతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సీఎం సహా పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు వేడుకల్లో పాల్గొననున్నారు. జిల్లా కేంద్రాల్లో ఇన్ ఛార్జ్ మంత్రుల ఆధ్వర్యంలో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వేసవి తీవ్రత దృష్ట్యా వేడుకలను ఉదయం 10 గంటల్లోపే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో అధికారులు ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు చేశారు.
1,100 మందికి పైగా పోలీసులు..
ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానుండగా, భద్రత, ట్రాఫిక్ నిర్వహణ కోసం 1,100 మందికి పైగా పోలీసు సిబ్బందిని మోహరించారు. సభకు ఆహ్వానితులు ఉదయం 7:30 గంటలలోపు వేదికకు చేరుకుని, ఒరిజినల్ పాస్లు వెంట తీసుకురావాలని సూచించారు.రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సికింద్రాబాద్, బేగంపేట్, తిరుమలగిరి, బోయిన్పల్లి, ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉంటాయని అధికారులు వెల్లడించారు.
పోలీసులకు పతకాలు..
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన పోలీసులకు సేవా పతకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు టీఎస్ జెన్కో విజిలెన్స్ అండ్ సెక్యూరిటి చీఫ్ ప్రతాప్కు సీఎం సర్వోన్నత పోలీసు పతకాన్ని ప్రకటించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రిజర్వ్ ఇన్స్పెక్టర్ రవి, చెర్ల సీఐ రాజు, ఇంటిలిజెన్స్ కానిస్టేబుల్ సంపత్, గ్రేహౌండ్స్లోని మరో ఏడుగురు అధికారులు శౌర్య పతకాలు కైవసం చేసుకొన్నారు. 16 మందికి మహోన్నత సేవా పతకాలు, 94 మంది ఉత్తమ సేవా పతకాలను పొందనున్నారు. వీరితోపాటు 50 మంది కఠిన సేవా పతకాలు, మరో 461 మంది సేవా పతకాలు వరించాయి.

