కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో జనసేన పార్టీ సభ (Janasena Telangana Meeting)కు ప్రభుత్వం అనుమతి నిరాకరించిన నేపథ్యంలో ఆ పార్టీ నేత, ఎమ్మెల్సీ నాగబాబు (Nagababu) ఎక్స్ వేదికగా ఓ ఆసక్తికర పోస్టు చేశారు. సదరు పోస్టులో జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) రాజకీయ ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. అదృష్టం అందరికీ కలిసి రాదని, కొంతమంది నిరంతరం శ్రమిస్తూ, వైఫల్యాలను ఎదుర్కొని మళ్లీ లేచి తమ విజయాన్ని తామే స్వయంగా నిర్మించుకోవాల్సి ఉంటుందని నాగబాబు అన్నారు. అటువంటి విజయం సామాన్యమైనది కాదని, అది ఒక చరిత్రగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ జీవిత ప్రయాణం కూడా అచ్చం అటువంటిదేనని ఆయన కొనియాడారు.
అధికార యంత్రాంగం లేదా ప్రతిపక్షాలు పవన్ కల్యాణ్ను అణచివేయాలని ప్రయత్నించిన ప్రతిసారీ ఆ అడ్డంకులే ఆయన సాధించే గొప్ప విజయాలుగా మారతాయని నాగబాబు స్పష్టం చేశారు. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు కూడా అచ్చం అలాగే ఉన్నాయని ఆయన విశ్లేషించారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా, ఆ అణచివేతలే పవన్ కల్యాణ్ సాధించబోయే అద్భుత విజయానికి నాంది పలుకుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

