కలం, వెబ్ డెస్క్: ఏపీలో మెగా డీఎస్సీ (Mega DSC) వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా (Jakkampudi Raja) తీవ్ర విమర్శలు చేశారు. హెరిటేజ్లో పాలు అమ్ముకున్నట్లుగా డీఎస్సీ ఉద్యోగాలను అమ్ముకున్నారని, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వేదికగా వీటికి వేలం పాటలు నిర్వహించారని జక్కంపూడి ఆరోపించారు. లక్షలు ఖర్చు చేసి రోజు కష్టపడి చదువుకున్న నిరుద్యోగుల కన్నీళ్లు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఈ భారీ కుంభకోణంలో లోకేశ్ను ఏ-1 నిందితుడిగా అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే లోకేశ్ను మంత్రి పదవి నుంచి తొలగించాలని చెప్పారు. రాష్ట్రంలో లోకేశ్ చేయని అవినీతి, దోపిడీ ఏదీ లేదని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐ లేదా హైకోర్ట్ జడ్జితో పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

