కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) నగరపాలక సంస్థ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ (Telangana Formation Day) వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. కార్యాలయ ప్రాంగణంలో కమీషనర్ ప్రఫుల్ దేశాయ్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, పలువురు పాలకవర్గ సభ్యులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. పాలకవర్గ సభ్యులు, అధికారులు ముక్తకంఠంతో జాతీయ గీతంతో పాటు, తెలంగాణ అధికారిక గీతాన్ని ఆలపిస్తూ త్రివర్ణ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన అమరుల త్వాగాలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ.. ఎందరో అమరవీరుల త్యాగాలు, సుదీర్ఘ పోరాటాల ఫలితంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్దించిందని అన్నారు. అదే ఉద్యమ స్ఫూర్తితో స్వరాష్ట్రంలో ప్రభుత్వాల పరిపాలన ప్రజలకు మరింత చేరువైందని అన్నారు. నాటి నుండి తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్దే ధ్యేయంగా ప్రభుత్వాలు పాలన కొనసాగిస్తూ వస్తున్నాయని తెలిపారు. వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ రాష్ట్రం ఎంతో ప్రగతిని సాధించిందని తెలిపారు. ఇందులో భాగంగా కరీంనగర్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు పాలకవర్గం అధికారులు సమన్వయంతో పని చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ అవతరణ దినోత్సవ వారోత్సవాలను విజయవంతం చేస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ.. ఎంతో మంది అమరుల త్యాగాలు, పోరాటాల వల్లే తెలంగాణ స్వరాష్ట్రం సాద్యమైందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఉద్యమ నేపథ్యాన్ని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాకే కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధి చెందిందని అన్నారు. ఆనాడు నీళ్ళు, నిధులు, నియామకాల కోసం ప్రత్యేక తెలంగాణ కావాలనుకున్నామని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని అన్నారు. ప్రజా సంక్షేమమే ద్యేయంగా కరీంనగర్ నగరపాలక సంస్థలో మా నూతన పాలకవర్గం పని చేస్తుందని తెలిపారు. కరీంనగర్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మా పాలకవర్గం పని చేస్తుందని తెలిపారు. ఈ వేడుకలో కార్పోరేటర్లు బండ రమణ రెడ్డి, చొప్పరి జయశ్రీ, కో ఆప్షన్ సభ్యులు కన్న కృష్ణ, బల్బీర్ సింగ్, డిప్యూటీ కమీషనర్ వేణు, ఖాదర్ మొహియుద్దీన్, ఎస్ఈ రాజ్ కుమార్, ఈఈ సంజయ్ కుమార్, ఏసీపీ వేణు, శ్రీధర్, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

