కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రత కోసం తీసుకొస్తున్న ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (EHS) అమలుకు సంబంధించి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth) అధికారులతో కీలక సమీక్ష నిర్వహించనున్నారు. ఈ పథకాన్ని పూర్తిగా ఎంప్లాయి హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ట్రస్ట్లో ఉద్యోగ సంఘాల నుంచి ఆరుగురు ప్రతినిధులు, పెన్షనర్ల తరఫున ఇద్దరు ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఒక ఉన్నతాధికారిని ఈ ట్రస్ట్కు సీఈవోగా నియమిస్తారు. ఈ కమిటీకి సంబంధించిన అధికారిక ప్రకటన రేపు వెలువడే అవకాశం ఉంది.
ఈ హెల్త్ స్కీమ్ విజయవంతంగా అమలు చేయడానికి అవసరమైన సమాచార సేకరణ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యుల పూర్తి వివరాలను సేకరించాలని ఆర్థిక శాఖ ఇప్పటికే అన్ని శాఖలకు సర్క్యులర్ జారీ చేసింది. మే 31వ తేదీ లోపు ఈ డేటా మొత్తాన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని స్పష్టం చేసింది. ఈ డేటా ఆధారంగానే లబ్ధిదారులందరికీ డిజిటల్ హెల్త్ కార్డులను పంపిణీ చేస్తారు. దీని ద్వారా ఉద్యోగులకు, వారి కుటుంబాలకు ఎలాంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండానే పూర్తి క్యాష్లెస్ చికిత్స సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

