కలం, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) సమావేశాలు రేపటి నుంచే ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం జరగబోతుండగా.. రేపటి షెడ్యూల్ను అసెంబ్లీ సచివాలయం విడుదల చేసింది. సీఎం రేవంత్ రెడ్డి మూడు నివేదికలను సభలో ప్రవేశ పెట్టబోతున్నారు. తెలంగాణ సమగ్ర శిక్ష ఆడిట్ నివేదిక, పీఎం శ్రీ స్కూల్స్ ఆడిట్ నివేదిక, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ గత అయిదు వార్షిక నివేదికలను సభ ముందు ఉంచబోతున్నారు. సభ ప్రారంభం కాగానే క్వశ్చన్ అవర్ ఉండనుంది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత శాఖల మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు.
వాడీవేడిగా సాగుతాయా..?
అసెంబ్లీ సమావేశాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య వాడీవేడి చర్చ జరిగే అవకాశం ఉంది. విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు, పాలిటెక్నికల్ విద్య కోసం తెచ్చిన జీవో నెం.97తో పాటు పలు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ప్రతిపక్షానికి ధీటుగా కౌంటర్ ఇవ్వాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసింది. బీజేపీ సైతం అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేలా పలు సమస్యలను ప్రస్తావించబోతుంది. సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాబోతుండగా.. ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరు కాబోరని ఇప్పటికే బీఆర్ఎస్ ప్రకటించింది.

