కలం, వెబ్ డెస్క్: ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది (Supreme Court – Freebies). ఎన్నికలకు ముందు ఉచితాలు, రాయితీలు ప్రకటించడంపై పలు ప్రశ్నలు సంధించింది. ఈ ఖర్చుల భారాన్ని చివరికి పన్నులు కట్టేవాళ్లే భరించాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది. తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం ప్రజలందరికీ ఉచిత విద్యుత్ ప్రకటించడంపై దాఖలైన ఓ పిటిషన్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం పంచోలితో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది.
ఉచితాలకు డబ్బెలా?
ఉచిత పథకాలు ఇస్తామని చెప్పినప్పుడు, వాటికి డబ్బు వస్తుందని ధర్మాసనం ప్రశ్నించింది. ‘ఉచితాల డబ్బు ఎవరు చెల్లిస్తారు? ఇది పన్ను కట్టేవాళ్ల సొమ్ము కాదా?’ అని అడిగింది. అదుపు లేని ఉచితాల పంపిణీ దేశ ఆర్థికాభివృద్ధికి ఆటంకమవుతుందని హెచ్చరించింది. ఆదాయ లోటు పెరుగుతున్నప్పటికీ రాష్ట్రాలు పెద్దఎత్తున సంక్షేమ పథకాలు ప్రకటించడం ఆందోళనకరమని వ్యాఖ్యానించింది. అభివృద్ధికి వాడాల్సిన నిధులు సంక్షేమ పథకాలకే వెళ్తున్నాయనే అభిప్రాయం వ్యక్తం చేసింది. ఉద్యోగాల సృష్టిపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని సూచించింది.
ఉచిత విద్యుత్పై ఆందోళన..
ఉచిత విద్యుత్ పథకాలపైనా న్యాయస్థానం ప్రశ్నలు లేవనెత్తింది (Supreme Court – Freebies). కొన్ని రాష్ట్రాల్లో పెద్ద భూస్వాములు కూడా ఉచిత విద్యుత్ పొందుతున్నారని, ఇది ప్రభుత్వ నిధులపై భారం మోపుతోందని పేర్కొంది. ఎన్నికల ముందు ఉచిత పథకాలు ప్రకటించడం ఎందుకని ప్రశ్నించింది.
తమిళనాడులో విద్యుత్ టారిఫ్లను నోటిఫై చేసిన తర్వాత ఉచిత విద్యుత్పై ప్రకటన చేయడాన్ని ఆక్షేపించింది. ఇందులో టారిఫ్ల వ్యత్యాసంపైనా ప్రశ్నలు లేవనెత్తింది. పిటిషన్పై తదుపరి విచారణకు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ సమాధానాలు కోరింది.


