కలం, స్పోర్ట్స్ : హోంగ్రౌండ్లో ముంబై ఇండియన్స్ మరో ఓటమిని మూటగట్టుకుంది. మంగళవారం ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్ (SRH vs MI) లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు 20 ఓవర్లలో 243 పరుగుల భారీ స్కోరు సాధించినప్పటికీ, సన్రైజర్స్ హైదరాబాద్ ఆ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. రయాన్ రికెల్టన్ తన తొలి ఐపీఎల్ సెంచరీతో ముంబైకి కొండంత స్కోరు అందించినప్పటికీ, బౌలర్ల వైఫల్యం జట్టు కొంపముంచింది.
244 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్రైజర్స్కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ కలిసి కేవలం 8.4 ఓవర్లలోనే 129 పరుగులు జోడించి ముంబై బౌలర్లను ఆత్మరక్షణలో పడేశారు. అనుభవం ఉన్న జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ వంటి బౌలర్లు కూడా పవర్ప్లేలోనే 92 పరుగులు సమర్పించుకోవడం గమనార్హం. కేవలం 18.4 ఓవర్లలోనే సన్రైజర్స్ లక్ష్యాన్ని చేరుకుని విజయం సాధించింది.
జట్టు ఓటమి అంచున ఉన్న సమయంలో డ్రెస్సింగ్ రూమ్లో కూర్చున్న మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ముఖంలో స్పష్టమైన నిరాశ కనిపించింది. జట్టు పట్టు కోల్పోతుంటే ఆయన నిర్వేదంతో చూస్తున్న దృశ్యాలు అభిమానులను కలచివేస్తున్నాయి. మరోవైపు కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన బౌలింగ్ విభాగంపై అసహనం వ్యక్తం చేశారు. ఒత్తిడిలో బౌలర్లు ప్రణాళికలను అమలు చేయలేకపోతున్నారని ఆయన అంగీకరించారు. ముంబై ఇండియన్స్ స్థాయికి తగ్గట్టుగా తమ ప్రదర్శన లేదని, ప్రస్తుతానికి తమ వద్ద ప్రత్యామ్నాయాలు కూడా తక్కువగా ఉన్నాయని ఆయన వాపోయారు. అయితే యాజమాన్యం, సహాయక సిబ్బంది అండతో త్వరలోనే పుంజుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

