కలం, ఖమ్మం బ్యూరో: తెలంగాణలోనే అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా పేరు గాంచిన ఖమ్మం (Khammam) వ్యవసాయ మార్కెట్కు సమ్మర్ హీట్ తగులుతోంది. కార్మిక సంఘాల వినతి మేరకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని రేపటి నుంచి జూన్ 5 వరకు మార్కెట్ కమిటీ సెలవులు ప్రకటించింది. మార్కెట్లో నిత్యం వేల సంఖ్యలో హమాలీలు, ఇతర కార్మికులు ఎండలో పని చేస్తుంటారు. తీవ్రమైన ఎండ, వడగాలుల కారణంగా కార్మికుల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉండటంతో కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. వ్యాపార లావాదేవీలు నిలిచిపోయినా… దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం వ్యాపార వర్గాలు కూడా ఈ నిర్ణయానికి మద్దతు తెలపడం విశేషం. జూన్ రెండో వారం నుంచి మార్కెట్ మళ్లీ కళకళలాడనుంది.
నిల్వ సదుపాయం లేకపోయినా..
మార్కెట్ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయంతో రైతులు, తమ వద్ద ఉన్న పంటను జూన్ 6 వరకూ మార్కెట్కు తీసుకొచ్చే అవకాశం లేదు. అయితే, పంట నిల్వ చేసుకునే సదుపాయం లేని రైతులు కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంది. వేడి నుంచి కూలీలను రక్షించుకోవడానికి తీసుకున్న ఈ నిర్ణయం సమంజసమైనదే అయినా.. ఈ విరామం వల్ల మార్కెట్ ధరలలో హెచ్చుతగ్గులు రాకుండా, రైతులు దళారుల చేతిలో మోసపోకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాల్సి ఉందని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి.

