కలం, వెబ్ డెస్క్: నేడు విశాఖలోని నక్కపల్లిలో సీఎం చంద్రబాబు (CM Chandrababu) పాల్గొంటున్న స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమం విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ కార్యక్రమం సందర్భంగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు జనాన్ని తరలించేందుకు పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు పాఠశాలల బస్సులను కూడా వినియోగిస్తున్నారు. దీంతో ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ముఖ్యంగా పదో తరగతి పరీక్షలు జరుగుతున్న తరుణంలో, బస్సులు లేక విద్యార్థులు బస్టాప్ల వద్దే నిరీక్షించాల్సి వచ్చింది. సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలపై ఆధారపడాల్సి వచ్చింది.
మరోవైపు సీఎం పర్యటన నేపథ్యంలో నర్సీపట్నంలోని ప్రభుత్వ పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించడం చర్చనీయాంశమైంది. ప్రైవేటు విద్యాసంస్థల బస్సులను సైతం సభ కోసం తరలించాలని ఉత్తర్వులు జారీ చేయడంతో విద్యా వ్యవస్థపై రాజకీయ సభల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అభివృద్ధి పనుల శంకుస్థాపన సంతోషించదగ్గ విషయమే అయినా పరీక్షల సమయంలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారమే పలు పాఠశాలలు సీఎం సభ కారణంగా సెలవు ఇస్తున్నట్లు ప్రకటించాయి.

