కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి (Ellareddy)లో విషాదం చోటు చేసుకుంది. బీసీ బాలికల వసతి గృహంలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని శ్రావణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మెట్ల మీద నుంచి కింద పడి చనిపోయిందని హాస్టల్ సిబ్బంది కుటుంబ సభ్యులు, బంధువులకు సమాచారం ఇచ్చారు. హాస్టల్ సిబ్బంది వివరాల ప్రకారం.. శ్రావణి తెల్లవారుజామున వాష్ రూమ్ కోసం వెళ్లి వస్తుండగా వరండాలో కింద పడిపోయింది. ఇది గమనించిన తోటి స్టూడెంట్స్ సిబ్బందిని నిద్ర లేపి సమాచారం అందించారు. సిబ్బంది వెంటనే ఆమెను ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే శ్రావణి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆర్డీవో ప్రభాకర్, తహశీల్దార్ ప్రేమ్, సీఐ రాజిరెడ్డి, ఎస్సై మహేష్ ఆస్పత్రికి చేరుకున్నారు. అనంతరం హాస్టల్లో విచారణ చేపట్టారు. నస్రుల్లాబాద్ మండలం హాజీపూర్కు చెందిన మృతురాలు శ్రావణి తండ్రి చనిపోయాడు. తల్లి ఆరోగ్యం కూడా బాలేదు. నాలుగేళ్లుగా శ్రావణి హాస్టల్లో ఉండి చదువుతోంది. అయితే, విద్యార్థిని మెట్ల మీద నుంచి కిందపడి చనిపోయిందా లేదా గుండెపోటుతోనా, ఇంకేదైనా కారణం ఉందా అనే విషయం తెలియాల్సి ఉంది. అయితే హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే శ్రావణి చనిపోయిందని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని లేదంటే ఆందోళన చేపడతామని విద్యార్థిని బంధువులు చెబుతున్నారు.

