కలం, వెబ్ డెస్క్ : ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీశైలం (Srisailam)లో అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా కలకలం రేగింది. అక్కడి అబ్బూరు వీఐపీ కాటేజీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కాటేజీలోని మొదటి అంతస్తులో ఉన్న ఒక గదిలో ఏసీ ఒక్కసారిగా పేలిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీ పేలి మంటలు భారీగా ఎగసిపడ్డాయి.
నిద్రలో ఉన్న భక్తులు ఒక్కసారిగా పేలుడు శబ్దం రావడంతో బయటకు పరుగులు తీశారు. గదిలో మంటలు వేగంగా వ్యాపించడంతో భయాందోళనలు నెలకొన్నాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
మంటలు సకాలంలో అదుపులోకి రావడంతో పెను ప్రమాదం తప్పిందని, భక్తులందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఫస్ట్ ఫ్లోర్ బెడ్రూం పూర్తిగా పొగతో నిండిపోయినప్పటికీ, ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


