కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) స్పందించారు. హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని తెలంగాణ ఉన్నత విద్య మండలి సెక్రటరీ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్తో శ్రీనివాస్ గౌడ్, బీసీ విద్యార్థి జేఏసీ నాయకులు వేముల రామకృష్ణ, బీసీ రాష్ట్ర నాయకులు గుజ్జ కృష్ణ, తదితర సంఘాల ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఇంటరిమ్ ఆర్డర్లో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడం వలన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం చెల్లించడంలో ఆలస్యం జరిగిందన్నారు. దీని వల్ల ప్రైవేట్ కళాశాలలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ (SC/ST/BC/EBC/Minority) విద్యార్థుల నుంచి నేరుగా ఫీజు వసూలు చేసుకోవచ్చని అనుమతి ఇచ్చిందని తెలిపారు.
వెంటనే ప్రభుత్వం నుండి కౌంటర్ దాఖలు చేసి రాష్ట్రంలోని విద్యార్థుల నుండి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉన్నత చదువులు చదవడానికి, జాబ్స్ చేయడానికి సర్టిఫికెట్లు తప్పనిసరి కావడంతో విద్యార్థులు అప్పులు చేసి ఫీజు కట్టవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. 30వ తేదీలోపు ప్రభుత్వం కౌంటర్ వేసి, కళాశాల యాజమాన్యాలతో మాట్లాడి విద్యార్థులకు ఇబ్బందులు జరగకుండా చూడాలన్నారు. లేనిపక్షంలో 30తేదీ తర్వాత విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున కార్యాచరణ చేపట్టవలసి వస్తుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎస్సీ ఎస్టీ విద్యార్థి నాయకులు నర్సింహ, భరత్, సాయి, నందగోపాల్, ఉదయ్, తదితరులు పాల్గొన్నారు.

