కలం, వెబ్ డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.15 వేల కోట్ల నిధులు మంజూరు చేసిందని మంత్రి శ్రీధర్బాబు (Sridhar Babu) అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం ఆయన సభలో ప్రసంగించారు. ప్రతిపక్షాలు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా ఆయన స్పందించారు. మున్సిపల్శాఖ అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ ప్రణాళికను తీసుకున్నారని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మెుదలుపెట్టిన పనులకు తమ ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని స్పష్టం చేశారు. నగరంలో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్పారు. సిటీలో 15 రోజుల్లో డెవలప్ మెంట్ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. అభివృద్ధి పనులకు ప్రణాళిక ప్రకారంగా నిధులు మంజూరు చేస్తున్నామని వివరించారు.
నగరంలో ట్రాఫిక్ సమస్యపై బీఆర్ఎస్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) సభలో మాట్లాడారు. అనేక రాష్ట్రాల వారు హైదరాబాద్లోనే నివసిస్తున్నారని చెప్పారు. పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్ రద్దీ వల్ల నగరంలో సమస్యలు వస్తున్నాయన్నారు. కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు జీహెచ్ఎంసీలో ఫ్లైఓవర్లు నిర్మించారని గుర్తుచేశారు. రెండేళ్లలో హైదరాబాద్ నగర్ అభివృద్ధిపై ఎలాంటి చర్చ జరగట్లేదని విమర్శించారు. జీహెచ్ఎంసీ పరిధిలో నియోజకవర్గ అభివృద్ధి గురించి పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి సభలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేసింది కానీ, తట్టెడు మట్టి కూడా ఎత్తలేదని చెప్పారు. అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. జీహెచ్ఎంసీ పరిధి ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించాలని కోరారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ (KP Vivekananda) మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ అభివృద్ధిపై చర్చ జరగాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. కుత్బుల్లాపూర్లో ఫ్లైఓవర్ పనులు ఇప్పటివరకు పూర్తి కాలేదన్నారు. రహదారులపై హెచ్ఎండీఏ కమిషనర్ను అడిగితే.. తమపై ఒత్తిడి ఉన్నట్లు చెప్పారని అన్నారు. పర్యవేక్షణ లేక నగరంలో పలు అభివృద్ధి పనులు ఆగిపోతున్నాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితోనే పనులు నిలిచిపోతున్నాయని మండిపడ్డారు.

