కలం, వెబ్డెస్క్: ఐపీఎల్ తొలి సీజన్లో జరిగిన ఆ చేదు జ్ఞాపకం మరోసారి క్రికెట్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. టీమ్ ఇండియా మాజీ ఆటగాళ్లు హర్భజన్ సింగ్ (Harbhajan Singh), శ్రీశాంత్ (Sreesanth) మధ్య ఎప్పటి నుంచో సద్దుమణిగింది అనుకున్న ‘స్లాప్గేట్’ వివాదం ఇప్పుడు మళ్లీ కొత్త మలుపు తిరిగింది. ఒకప్పుడు అన్నదమ్ములుగా మెలిగిన వీరిద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. మరోసారి ఈ వివాదాన్ని ఉద్దేశించి శ్రీశాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల హర్భజన్ సింగ్ ఒక టీవీ ప్రకటనలో నటించారు. అందులో 2008 నాటి చెంపదెబ్బ ఉదంతాన్ని హాస్యం కోసం వాడుకున్నారని శ్రీశాంత్ ఆరోపిస్తున్నారు. ఆ పాత ఘటనను వ్యాపార ప్రకటనల కోసం వాడుకోవడం తనను తీవ్రంగా నొప్పించిందని ఆయన వాపోయారు. ఆ యాడ్ ద్వారా హర్భజన్ దాదాపు ఒక కోటి రూపాయల వరకు సంపాదించారని, పైగా ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయమని తననే కోరడం విడ్డూరంగా ఉందని శ్రీశాంత్ అసహనం వ్యక్తం చేశారు.
హర్భజన్ గతాన్ని మర్చిపోయి మళ్లీ అదే తప్పు చేస్తున్నారని, అందుకే ఆయనను ఇన్స్టాగ్రామ్లో బ్లాక్ చేసినట్లు వెల్లడించారు. బయట ప్రపంచానికి హర్భజన్ మంచి వ్యక్తిగా కనిపిస్తున్నా, అది అంతా ఉత్త నటన మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. తాను హర్భజన్తో అన్ని సంబంధాలను తెంచుకున్నానని, భవిష్యత్తులో ఆయనతో స్నేహం ఉండే అవకాశం లేదని శ్రీశాంత్ (Sreesanth) పరోక్షంగా తేల్చి చెప్పారు. పాత గాయాలు మానుతాయని భావించిన సమయంలో, తాజా వాణిజ్య ప్రకటనల వల్ల ఏర్పడిన ఈ దూరం ఏ తీరానికి చేరుతుందో వేచి చూడాలి.
Read Also: టీమిండియాలో పడిక్కల్కు చోటెక్కడ? సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు..
Follow Us On : WhatsApp

