కలం, నల్లగొండ బ్యూరో: ప్రతినెలా చివరి శనివారం దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక ప్రజావాణి (Special Prajavani) కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ బీ చంద్రశేఖర్ (Collector Chandrasekhar) ప్రకటించారు. ఈ ప్రత్యేక ప్రజావాణిని ఈనెల 28 నుంచి ప్రారంభిస్తున్నామన్నారు. ప్రజావాణిలో భాగంగా సోమవారం ఆయన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలిసి ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ముందుకు వెళ్లాలని, ఈ వారంలో సామూహిక ఇందిరమ్మ గృహప్రవేశాలకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఉపాధి హామీ పథకం కింద ఇంకా మొదలు పెట్టని పనులపై నివేదిక సమర్పించాలని, వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లు రెగ్యులర్గా తనిఖీలు నిర్వహించి నివేదిక సమర్పించాలన్నారు.
పదోతరగతి పరీక్షలు సవ్యంగా జరిగేలా మండల ప్రత్యేక అధికారులు చూడాలని కలెక్టర్ సూచించారు. రంజాన్ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున రంజాన్ తోఫాల పంపిణీ, ఇఫ్తార్ ఏర్పాటుకు సంబందిత శాసనసభ్యుల సమ్మతితో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ నెల 22, 23 తర్వాత రబీ ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకుంటున్నందున మిల్లుల ట్యాగింగ్, గ్రామ పంచాయతీల వారీగా ఏర్పాటు చేసే ధాన్యం కొనుగోలు కేంద్రాలను మరోసారి పరిశీలించి ఏర్పాట్లకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, దేవరకొండ, చండూరు ఆర్డీవో రమణారెడ్డి, శ్రీదేవి, జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించారు. కాగా ఈ సోమవారం రెవెన్యూకు 60 ఫిర్యాదులు, జిల్లా అధికారులకు 45 ఫిర్యాదులు వచ్చాయి.
Read Also: అసెంబ్లీ ఫైట్లో కేంద్ర మాజీ మంత్రులు..
Follow Us On: X(Twitter)

