కలం, నిర్మల్ : ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో బైంసా (Bhainsa) పట్టణంలో ప్రతి బుధవారం గ్రీవెన్స్ డే (Grievance Day) నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల (SP Janaki Sharmila) తెలిపారు. పట్టణంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ‘గ్రీవెన్స్ డే’ లో భైంసా సబ్డివిజన్ పరిధిలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. వారి సమస్యలను ఓపికగా విని, ప్రతి ఫిర్యాదుపై వెంటనే స్పందించారు.
కుటుంబ వివాదాలపై షీ టీం కౌన్సిలింగ్
ఈ విషయంపై సంబంధిత పోలీసు స్టేషన్ల అధికారులతో ఫోన్లో మాట్లాడి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రీవెన్స్ డే సందర్భంగా వచ్చిన కుటుంబ వివాదాలపై షీ టీం సిబ్బంది ఇరు వర్గాలకు కౌన్సిలింగ్ నిర్వహించారు. నిర్మల్ వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా భైంసాలోనే ఈ సేవలు అందించడం పట్ల బాధితులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బైంసా ఏఎస్పీ సాయికిరణ్ పాల్గొన్నారు.

