కలం, మహబూబ్నగర్ బ్యూరో: వనపర్తి (Wanaparthy) జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు తడిసి మొలకెత్తిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) డిమాండ్ చేశారు. బుధవారం ఆయన పెద్దమందడి, ఖిల్లా ఘనపూర్ మండలాలలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు. తడిసి మొలకెత్తిన ధాన్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధైర్యం చెబుతూ, ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని విమర్శించారు.
రాష్ట్రంలో 5లక్షల 42వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయినప్పటికీ, ప్రభుత్వం మాత్రం 90లక్షల ధాన్యం సేకరణ చేస్తున్నామని చెప్పి.. అందులోనూ 40 శాతం ధాన్యం కూడా సేకరించలేదని విమర్శించారు. రవాణా ఏజెన్సీల నిర్లక్ష్యం కారణంగా రైతులు నెలల తరబడి ధాన్యం అమ్మకానికి ఎదురు చూడాల్సి వస్తోందని అన్నారు. కొనుగోలు కేంద్రాలలో రైతుల పరిస్థితిని గమనించిన అనంతరం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో ఫోన్లో మాట్లాడిన నిరంజన్ రెడ్డి.. తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరారు.
రైతు వేదికలను తాత్కాలిక నిల్వ కేంద్రాలుగా వినియోగించే అవకాశాన్ని పరిశీలించాలని, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ల పనితీరుపై విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరతో కొనుగోలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సమితి మాజీ అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి, జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, మాజీ ఎంపీపీ కృష్ణా నాయక్, మండల పార్టీ అధ్యక్షుడు రాళ్ల కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

