కలం, మెదక్ బ్యూరో: మెదక్ (Medak) జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పు లింగాపూర్ వద్ద రైతులు నిరసన (Farmers Protest) చేపట్టారు. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ – వెల్దుర్తి ప్రధాన రహదారిపై ధాన్యం బస్తాలు దహనం చేసి ఆందోళన చేపట్టారు. గత నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బంది పడుతున్నామని, అయినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారులు వచ్చి ధాన్యం కొనుగోలు చేసే వరకు తాము ఇక్కడి నుంచి కదిలేది లేదని రోడ్డుపై గ్యాస్ పొయ్యి పెట్టి నిరసన తెలిపారు. జిల్లా కలెక్టర్ రావాలంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు.

