కలం, మెదక్ బ్యూరో : లంచగొండి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. ఎక్కడికక్కడ అవినీతిని ఆధారాలతో సహా బయటపెట్టి అరెస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలో సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు (SI Venkateshwarlu) లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే.. వెంకటేశ్వర్లు గతంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించాడు. ఆ సమయంలో ఓ ఇసుక లారీ కేసుకు సంబంధించి లారీని విడిచిపెట్టేందుకు రూ.20 వేలు లంచం డిమాండ్ చేశాడు. డబ్బులిస్తేనే లారీ బయటకు వస్తుందని ఎస్సై చెప్పడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. లంచం చెల్లింపులో భాగంగా బాధితుడు గత నెల 28న కానిస్టేబుల్ సత్యనారాయణకు రూ.15 వేలు గూగుల్ పే ద్వారా పంపించాడు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు మంగళవారం ఎస్సై వెంకటేశ్వర్లుని అరెస్ట్ అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
Read Also: తెలంగాణ వ్యాప్తంగా నిలిచిపోయిన భూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ
Follow Us On: Instagram

