కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యూ పాల్వంచ (Palwancha) పరిధిలోని అంబేద్కర్ సెంటర్ (Ambedkar Center) వద్ద రహదారి దుస్థితి రోజురోజుకీ అధ్వానంగా మారుతోంది. రోడ్డంతా పెద్ద పెద్ద గుంతలతో నిండిపోయి చెరువులను తలపిస్తుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ ప్రధాన కూడలిలో ప్రయాణించాలంటే ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పాల్వంచలో రోడ్ల పరిస్థితి నరకప్రాయంగా మారిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ రహదారిపై సరుకు రవాణా వాహనాలు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గుంతల కారణంగా బైక్పై వెళ్తున్నవారు అదుపుతప్పి కిందపడుతున్న ఘటనలు తరచూ జరుగుతున్నాయి. అత్యవసర సేవలు అందించే అంబులెన్స్ వాహనాలు కూడా సమయానికి చేరుకోలేని పరిస్థితి ఏర్పడింది. కొద్దిపాటి వర్షం పడినా గుంతలలో నీరు నిలిచిపోవడంతో రోడ్డో, గుంతో గుర్తుపట్టలేని పరిస్థితి నెలకొంటోంది. దీంతో ప్రమాదాల ముప్పు మరింత పెరుగుతోంది. రాత్రి వేళల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోందని స్థానికుడు ఆర్.వి. రమణ చౌదరి పేర్కొన్నారు.
ప్రజల రాకపోకలకు అత్యంత కీలకమైన ఈ రహదారిని వెంటనే మరమ్మతులు చేసి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు, వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజల ప్రాణాలకు సంబంధించిన ఈ సమస్యను అధికారులు అత్యవసరంగా తీసుకుని యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Also: రాష్ట్రంపై కిషన్రెడ్డి కుట్రలు : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!
Follow Us On : WhatsApp

