కలం, నకిరేకల్: యువత క్రీడల్లో రాణించి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) ఆకాంక్షించారు. నల్గొండ జిల్లా కేతపల్లి మండలం గుడివాడ గ్రామంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని కొనియాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ప్రతిష్టాత్మక క్రీడా పోటీలను నిర్వహించడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు.
గ్రామీణ క్రీడాకారులకు టోర్నమెంట్లు ఎంతో దోహదపడతాయని ఎమ్మెల్యే చెప్పారు. గ్రామాల్లో దాగి ఉన్న యువత క్రీడా ప్రతిభను వెలికితీయడంలో ఇలాంటి టోర్నమెంట్లు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా తీసుకుంటూ, పూర్తి క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలనీ వేముల వీరేశం తెలిపారు. అనంతరం టోర్నమెంట్లో పాల్గొంటున్న వివిధ జట్ల క్రీడాకారులను ఆయన పరిచయం చేసుకుని, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, క్రీడా నిర్వాహకులు, పెద్ద సంఖ్యలో యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

