కలం, నల్లగొండ: సాంకేతికంగా, విజ్ఞాన పరంగా ప్రపంచం ఎంత వేగంగా అభివృద్ధి చెందినా, మానవ ఆరోగ్యానికి యోగాను మించిన సాధనం లేదని హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఎన్ఆర్ఐ కన్వీనర్ శానంపూడి సైదిరెడ్డి (Shanampudi Saidireddy) అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్లగొండ జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ భవన్లో “ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్” ఆధ్వర్యంలో ముందస్తు యోగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సైదిరెడ్డి మాట్లాడుతూ, యోగా భారతదేశ సనాతన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిందని తెలిపారు. ప్రపంచ దేశాలకు యోగా గొప్పతనాన్ని చాటిచెప్పిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీదేనని ఆయన కొనియాడారు. నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు సైతం తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి యోగాను సాధనంగా ఉపయోగిస్తున్నారని అన్నారు. ఇది భారతదేశానికి గర్వకారణమని పేర్కొన్నారు.
“దేశం బాగుండాలంటే ముందుగా మనం ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలి” అని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులు చిన్నతనం నుంచే యోగాను అలవాటు చేసుకుంటే శారీరకంగా, మానసికంగా దృఢపడి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని విద్యార్థులను ఉద్దేశించి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, సీనియర్ నాయకులు పిల్లి రామరాజు, యోగా గురువు వెంకటేశ్వర్లు, “ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్” యాజమాన్య సభ్యులు, పాఠశాల విద్యార్థులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

