కలం, వెబ్ డెస్క్ : నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల సమయంలోనే ప్రశ్నాపత్రాల లీక్ ఘటన వెలుగులోకి రావడంతో విద్యాశాఖ కఠిన చర్యలు చేపట్టింది. ఈ కేసులో మొత్తం ఏడుగురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. ఆలూర్, మెండోరా మండలాలలోని జెడ్పీ హైస్కూల్ పరీక్షా కేంద్రాల నుంచే పదో తరగతి హిందీ, తెలుగు ప్రశ్నాపత్రాలు లీక్ అయినట్లు అధికారులు గుర్తించారు. పరీక్ష జరుగుతుండగానే కొందరు సిబ్బంది ప్రశ్నాపత్రాలను మొబైల్ ఫోన్లతో ఫోటోలు తీసి వాట్సాప్ ద్వారా షేర్ చేసినట్లు విచారణలో బయటపడింది.
ప్రాథమిక విచారణలో, తమకు తెలిసిన విద్యార్థులకు సహాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ చర్యలకు పాల్పడ్డారని తెలిసింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరగలేదని జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) స్పష్టం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఇద్దరు గెజిటెడ్ హెడ్మాస్టర్లు, ముగ్గురు స్కూల్ అసిస్టెంట్లు, ఇద్దరు సెకండరీ గ్రేడ్ టీచర్లపై చర్యలు తీసుకుని సస్పెండ్ చేశారు. అదనంగా, సంబంధితులపై తెలంగాణ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్-1997 (Public Examinations Act 1997) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఇక బోధన్(Bodhan) జూనియర్ కాలేజీలో ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందన్న వార్తలపై కూడా అధికారులు స్పష్టత ఇచ్చారు. అక్కడ పరీక్ష ముగిసిన తర్వాతే ప్రశ్నాపత్రం బయటకు వచ్చినట్లు నిర్ధారించారు. ఈ ఘటనతో పరీక్షల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.

