కలం, ఖమ్మం బ్యూరో: సీనియర్ జర్నలిస్టు, ‘జనంసాక్షి’ దినపత్రిక ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్ కూరాకుల గోపీ (Kurakula Gopi) మంగళవారం మధ్యాహ్నం అకాల మరణం చెందారు. ఆయన మృతి పట్ల మీడియా రంగంతో పాటు పలువురు రాజకీయ, సామాజిక ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోపీ మరణానంతరం ఆయన పార్థివదేహాన్ని అంతిమ సంస్కారాల నిమిత్తం స్వగ్రామమైన రఘునాథపాలెం మండలం పాపట్పల్లికి తరలించారు. గోపీ అకాల మరణవార్త తెలిసిన వెంటనే ఎంపీ వద్దిరాజు రవిచంద్ర హైదరాబాద్ నుంచి హూటాహుటిన పాపట్పల్లికి చేరుకున్నారు. ఆయన పార్థివదేహాన్ని సందర్శించి, పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
కూరాకుల గోపీ అంతిమయాత్ర మంగళవారం అత్యంత విషాద వాతావరణంలో సాగింది. గోపీ పార్థివదేహాన్ని ఉంచిన పాడేను ఎంపీ రవిచంద్ర, మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ, తదితర ప్రముఖులు తమ భుజాలపై మోసి అంతిమయాత్రలో స్వయంగా పాల్గొన్నారు. సీనియర్ జర్నలిస్టుకు నలుమూలల నుంచి వచ్చిన విలేకరులు, స్థానికులు కన్నీటి వీడ్కోలు పలికారు. అనంతరం గోపీ కుటుంబ సభ్యులను ఎంపీ రవిచంద్ర, పరామర్శించారు. వారిని ఓదార్చుతూ తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గోపీ మరణం ఆయన కుటుంబానికే కాకుండా పాత్రికేయ రంగానికి కూడా తీరని లోటని, విపత్కర పరిస్థితుల్లో ఉన్న కుటుంబానికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన భరోసానిచ్చారు.
సీనియర్ జర్నలిస్టు కూరాకుల గోపీ అకాల మృతి!

