కలం, నల్లగొండ బ్యూరో: యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లా మోత్కూరు సబ్ ట్రెజరీ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ సీనియర్ అకౌంటెంట్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. గురువారం మోత్కూరులోని ఎస్టీఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మోత్కూరు సబ్ ట్రెజరీ పరిధిలోని ఆయా శాఖల అధికారుల నుంచి వేతన బిల్లులు మంజూరులో బేరం కుదుర్చుకుని బిల్లులను చేయడంపై ఈనెల 4న మోత్కూరు ఎంపీఓపై జనార్దన్ రెడ్డి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. 38 రోజుల వేతనానికి సంబంధించి రూ.1,09,384 బిల్లును ప్రాసెస్ చేసేందుకు సీనియర్ అకౌంటెంట్ (Senior Accountant) మహ్మద్ ఖదీర్ రూ.10 వేలు లంచం డిమాండ్ చేశారు. చివరకు రూ.5 వేలు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది.
అందులో భాగంగానే ఫిబ్రవరి 5న ఫిర్యాదుదారుడు రూ. 5 వేలను ఖదీర్ సహోద్యోగి నిరంజన్కు ఫోన్ పే చేశాడు. ఫిబ్రవరి నెలకు సంబంధించి ఆదాయపు పన్ను మినహాయింపు లేకుండా చూస్తానని నమ్మించాడు. మరో రూ. 5 వేలను ఫిబ్రవరి 27న బదిలీ చేయించుకున్నాడు. అదేరోజు మరో వ్యక్తి నుంచి ఇదే పద్ధతిలో రూ. 5వేలు లంచం తీసుకున్నట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. ఈ మేరకు ఏసీబీ అధికారులు మహ్మద్ ఖదీర్ను అరెస్టు చేశారు. అనంతరం ఆయనను హైదరాబాద్లోని ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే, ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 కు ఫిర్యాదు చేయాలని అధికారులు కోరారు.

